1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (12:50 IST)

రూ.18 వేల కోట్లు ఇస్తే మునుగోడు ఉప పోరు నుంచి తప్పుకుంటాం : మంత్రి కేటీఆర్

ktrao
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నల్గొండకు రూ.18 వేల కోట్ల ప్యాకేజీని ఇస్తే మునుగోడు ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. 
 
ఇదే అంశంపై కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రధాని మోడీ ప్రభుత్వంపై వరుస ట్వీట్లు చేశారు. ఫ్లోరోసిస్‌ నిర్మూలనకు మిషన్‌ భగీరథకు రూ.19,000 కోట్లు కేటాయించాలన్న నీతి ఆయోగ్‌ సిఫార్సును కేంద్రం పట్టించుకోవడం కేటీఆర్ ఆరోపించారు. 
 
రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రభుత్వం ఓ వ్యక్తికి రూ.18 వేల కోట్ల ప్రాజెక్టును మంజూరు చేసిందని ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగితే దేశ సంపద పెరగదని మంత్రి కేటీఆర్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒక వ్యక్తికి కాంట్రాక్ట్‌ కేటాయిస్తే జిల్లా అభివృద్ధి చెందదని అన్నారు.
 
గత ఐదు నెలల్లో గుజరాత్‌కు రూ.80 వేల కోట్ల ప్యాకేజీలను కేంద్రం మంజూరు చేసిందని, తెలంగాణకు రూ.18 వేల కోట్లు కేటాయించలేదా? అని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ల ద్వారా ప్రశ్నించారు.