శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (10:49 IST)

ఆన్లైన్, డిజిటల్ క్లాస్‌లపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా

లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవటంతో ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ప్రారంభించిన డిజిటల్ తరగతులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీసారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారం అవుతున్న పాఠాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 
 
మాహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కె పురం డివిజన్, కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో పలువురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా వారితో ఏ తరగతులు చదువుతున్నారు, పాఠాలు అర్థం అవుతున్నాయా అని అడుగగా 
వారు బాగానే అర్థం అవుతున్నాయని జవాబు ఇచ్చారు. 
 
ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే యూ ట్యూబ్‌లో అందుబాటులో ఉంటాయని, అవసరం ఉంటే మరలా చూడాలన్నారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఒక్కొక్కరుగా వెళ్లి ఉపాధ్యాయులతో పాఠశాలకు వెళ్లి నివృత్తి చేసుకోవాలన్నారు.బయటకు వచ్చేటప్పుడు మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలని, కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. 
 
అక్కడే ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి మాట్లాడారు. నెల రోజుల కేలండర్‌తో ఆన్లైన్ తరగతులు ప్రారంభించినట్లు, పిల్లల డిజిటల్ చదువుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వర్క్ షీట్లు తదితర వాటితో ఏమేరకు విద్యార్థులు అనుసరిస్తున్నారో తెలుసుకుంటామని, ఇప్పటికి అయితే అన్నిరకాల చర్యలు విద్యా శాఖ ద్వారా తీసుకున్నాం అన్నారు.
 
మూడు భాషల్లో వర్క్ షీట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వీటిని ఎస్‌సిఈఆర్‌టి వెబ్‌సైట్లో నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. దూరదర్శన్, టి సాట్ ద్వారా ప్రతిరోజు ప్రసారం అయ్యే పాఠాలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.