శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (13:46 IST)

తెలంగాణా నుంచి ఏపీకి వెళ్లే వారిపై కొత్త ఆంక్షలు!!!

తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి అడుగుపెట్టాలనుకునేవారిపై కొత్త ఆంక్షలు విధించారు. ముఖ్యంగా, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. అదీకూడా వాడపల్లి వద్ద మాత్రమే వాహనాలకు అనుమతి ఇస్తామని పోలీసులు పేర్కొన్నారు. 
 
ఇదే అంశంపై నల్గొండ ఎస్పీ రంగనాథ్ స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లే వాహనాలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ విషయమై తమకు ఆదేశాలు అందాయని చెప్పారు. రాత్రి 7 గంటలలోపు మాత్రమే ఆయా వాహనాలు వాడపల్లి వద్ద సరిహద్దులను దాటాల్సి వుంటుందని చెప్పారు. 
 
అది కూడా పాస్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. జిల్లా మీదుగా మాచర్ల వైపునకు వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదని వెల్లడించిన ఆయన, ఏ వాహనమైనా వాడపల్లి మీదుగానే వెళ్లాల్సి వుంటుందని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ వద్ద చెక్ పోస్టు మూతబడివుంటుందని, కేవలం నిత్యావసర, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
 
కాగా, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లేవారిని అక్కడి అధికారులు 14 రోజుల హోమ్ క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. వీరి ఆరోగ్యాన్ని నిత్యమూ గ్రామ, వార్డు వలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు సమీక్షిస్తుంటారు. ఇక ఇల్లు దాటి బయటకు వచ్చినట్టు తెలిస్తే, వారిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. వారిపై పోలీసు కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి.