1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (13:13 IST)

మత్తెక్కించే మాటలతో వలవువలకు చిత్తైన యువకుడు.. ఆపై సూసైడ్... ఎందుకు?

ఓ యువతి వలపు వలకు ఓ యువకుడు చిక్కుకున్నాడు. మత్తెక్కించే మాయ మాటలు చెప్పడంతో ఆ యువకుడు ఆమెకు దాసోహమైపోయాడు. ఆ తర్వాత ఆ యువకుడిని నగ్నంగా చేసి.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసింది. తన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మొబైల్‌కు వచ్చిన ఓ మెసేజ్ అతడిని ఆకర్షించింది. 
 
తాను ఒంటరి మహిళనని, మీతో చాటింగ్ చేయాలనుకుంటున్నానని ఉన్న ఆ మెసేజ్‌కు అతడు వెంటనే రిప్లై ఇచ్చాడు. ఆ వెంటనే అటునుంచి ఓ యువతి  వీడియో కాల్‌చేసి నగ్నంగా మాట్లాడింది. అక్కడితే ఆగక తన మత్తెక్కించే మాటలతో అతడిని కూడా నగ్నంగా మార్చేసింది.
 
అసలు కథ ఆ తర్వాత నుంచి ప్రారంభమైంది. ఆ వీడియో సంభాషణను రికార్డు చేసిన ఆమె డబ్బుల కోసం డిమాండ్ చేసింది. అడిగినంత ఇవ్వకుంటే ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామంటూ ముఠా సభ్యులతో కలిసి యువకుడిని బెదిరించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని యువకుడు తన ఖాతాలో ఉన్న రూ.24 వేలను వారికి బదిలీ చేశాడు. 
 
అయినప్పటికీ వారి నుంచి వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండడంతో నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లాడు. ఆ తర్వాతి రోజు ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. 
 
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నిజామాబాద్ ఆసుపత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.