1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (12:16 IST)

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను బంద్‌ చేయండి.. కేటీఆర్ హితవు

ఆరు నెలలపాటు సినిమాలకు దూరంగా ఉండాలని, క్రికెట్‌ తక్కువగా చూడాలని, ఫోన్‌లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను బంద్‌ చేసి చదువుపై దృష్టి సారించాలని పురపాలక, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు. 
 
కష్టపడి కనిపెంచి పెద్దవాళ్లను చేసిన తల్లిదండ్రులను సంతోషపెట్టేలా మంచి భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని హితవు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కోచింగ్‌ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక ఉద్యోగానికి పదుల సంఖ్యలో పోటీ ఉంటుందని.. అదే పోటీతత్వంతో పట్టుదలగా చదువుకొని ఉద్యోగాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. 
 
సోమవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ నుంచి ప్రతాప్‌సింగారం వరకు రూ.25.32 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనతోపాటు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ వెంకట్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.  
 
జర్మనీ తరహాలో ఓ పక్క చదువుకొంటూనే పరిశ్రమల్లో విధులు నిర్వహించే ప్రణాళికను భవిష్యత్తులో రాష్ట్రంలో అమలుకు ఆలోచన చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 
 
కేంద్ర ప్రభుత్వరంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్టు ఇటీవలే పార్లమెంట్‌లో ప్రభుత్వమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వాటి ఖాళీల భర్తీ తప్పదని.. వాటిలో తెలంగాణ భాగం దాదాపు 70 వేల వరకు ఉంటాయని తెలిపారు.