1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (08:37 IST)

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం

cmkcr
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దేశ వ్యాప్తం పర్యటనలో భాగంగా, ఆయన హస్తిన పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ పర్యటన మొత్తం ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ఇందులోభాగంగా, ఆయన గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళతారు. అక్కడ వివిధ పార్టీల నేతలు, ఆర్థిక వేత్తలతో సమావేశమవుతారు. దేశ ఆర్థిక  పరిస్థితులపై ఆయన చర్చిస్తారు. జాతీయ మీడియాతోనూ భేటీ అవుతారు. 
 
ఆ తర్వాత 22వ తేదీన చండీగఢ్ చేరుకుని కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన 600 మంది రైతు కుటుంబాల వారిని ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి పరామర్శిస్తారు. ఆ తర్వాత ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. 
 
26న బెంగుళూరుకు చేరుకుని మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎ కుమార స్వామిలతోనూ, 27న మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధికి వెళ్లి అక్కడ అన్నా హజారేతో సమావేశమవుతారు. అక్కడ నుంచి షిర్డీకి వెళ్లి సాయిబాబాను దర్శనం చేసుకుని, నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 29 లేదా 30వ తేదీల్లో వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు వెళతారు. ఈ సందర్భంగా ఇండో చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్‌ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల కుటుంబాలను పరామర్శిస్తారు.