గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (19:01 IST)

టిక్కెట్ల ధరల పై హైకోర్టు: తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం

కరోనా ప్రభావం సినీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి లాక్ డౌన్ అనంతరం 50 శాతం ఆక్యూపెన్సీతో తెరచుకున్న థియేటర్స్ పై కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఆర్థికంగా నష్టపరిచింది. దీంతో థియేటర్స్ మూత పడిన సంగతి తెలిసిందే. ఇక క్రమంగా కరోనా కేసులు తగ్గుపట్టిన నేపథ్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించింది. 
 
దీంతో జూలై 30 నుంచి థియేటర్లలో బొమ్మ పడబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే థియేటర్లు ఓపెన్ చేసినా.. ప్రేక్షకులు వస్తారనే నమ్మకం మాత్రం అటు నిర్మాతలకు.. ఇటు థియేటర్స్ యాజమానులకు కలగడం లేదు. దీంతో రోజుకీ నాలుగు ఆటలతోపాటు.. టికేట్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
 
ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు జూలై 27న విచారణ జరిపింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది న్యాయస్థానం. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. 
 
ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశించింది. అంతేకాకుండా.. ఇదే విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోం శాఖ సెక్రెటరీలను హైకోర్టు ఆదేశించింది.