శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 జులై 2021 (17:01 IST)

పాము కరిచింది.. అయినా తల్లిదండ్రులు తిడతారనీ...

ఆ చిన్నారిని పాము కరించింది. కానీ, ఆ చిన్నారికి తల్లిదండ్రులంటే అమితమైన భయం. దీంతో పాము కరిచినప్పటికీ.. తల్లిదండ్రులకు కనీసం మాటమాత్రం చెప్పలేదు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ  వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఉల్వనూరు పంచాయతీ లక్ష్మీదేవిపల్లికి చెందిన బోడ భాస్కర్, భారతి దంపతులకు సంతానం కలగకపోవడంతో ఏడేళ్ల క్రితం బంధువుల పాప అఖిలను దత్తత తీసుకున్నారు. 
 
ఆర్నెళ్ల ప్రాయం నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పాపే ప్రాణంగా ఆ దంపతులు బతికారు. ఆదివారం ఎనిమిదో పుట్టినరోజు వేడుకను అమ్మమ్మ ఇంటి వద్ద జరుపుకోవాలని శనివారం కొత్తగూడెంలోని కారుకొండ రామవరం వెళ్లారు. 
 
సాయంత్రం ఆ చిన్నారి స్నేహితులతో కలిసి ఆడుకుంది. ఆ సమయంలో ఓ విష పాము వేలిపై కాటేసింది. దీంతో అఖిల ఒక్కసారి భయపడి ఇంట్లోకి పరుగున వెళ్లింది. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచిపెట్టింది. కాలికి మేకు గుచ్చుకుందని అబద్ధం చెప్పింది. ఎలాంటి గాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, తెల్లవారేసరికి విష తలకెక్కడంతో మృత్యువొడిలోకి జారుకుంది.