శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (12:15 IST)

భర్త చనిపోయినా ఆగని లోన్ యాప్ సిబ్బంది వేధింపులు

suicide
హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో రుణం తీసుకున్నాడు. అది తిరిగి చెల్లించడంలో జాప్యమైంది. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు భరించలేక ఆ వ్యక్తి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో మృతుని భార్య గర్భంతో ఉండగా, ఇపుడు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, తన భర్త మృతితో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అదేసమయంలో లోన్ యాప్ నిర్వాహకులు రెండేళ్ల పాటు మిన్నకుండిపోయారు. ఇపుడు మళ్లీ వేధింపులకు దిగారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన పండిటి సునీల్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ కావడంతో ఉద్యోగం కోల్పోయాడు. అదేసమయంలో భార్య రమ్యశ్రీ గర్భంతో ఉండటంతో అప్పులు తీసుకున్నాడు. 
 
వీటిలో ఓ లోన్ యాప్ నుంచి తీసుకున్నాడు. అప్పు తీసుకున్న వారం రోజుల నుంచి సునీల్‌కు నిర్వాహకులు ఫోన్లు చేసి వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు భరించలేని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన 2020 డిసెంబరులో జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అప్పటి నుంచి మిన్నకుండిన లోన్ యాప్ నిర్వాహకులు ఇపుడు రమ్యశ్రీకి ఫోన్ చేసి మళ్లీ వేధింపులకు పాల్పడుతున్నారు. మీ భర్త బాకీ ఉన్న మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని ఫోన్లలో బెదిరిస్తున్నారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.