శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నోటికొచ్చినట్టు మాట్లాడితే అరెస్టుచేసి లోపల పడేస్తాం : విపక్ష నేతలకు తలసాని వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలకు ఆ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం భవనాలను హైకోర్టు అనుమతి మేరకు మంగళవారం నుంచి కూల్చివేస్తున్నారు. ఇక్కడ కొత్త సచివాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. దీనికి సంబంధించిన నమూనాను కూడా తెలంగాణ సీఎంవో విడుదల చేసింది. 
 
అయితే, నిజాంకాలంనాటి పాత సచివాలయం కూల్చడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. విభజన చట్టం ప్రకారం సెక్షన్-8 అమలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం కరోనా నివారణ చర్యల గురించి పట్టించుకోకుండా, కూల్చివేతలపై దృష్టి పెడుతోందంటూ మండిపడుతున్నాయి. 
 
ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఏ కార్యక్రమమైనా ఆపిందా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు. 
 
కొత్త సచివాలయం కడితే వచ్చే ఇబ్బంది ఏంటని నిలదీశారు. కాంగ్రెస్ నేతలకు సెక్షన్-8 ఆలోచన రావడం దుర్మార్గమన్నారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు, లోపల పడేస్తాం అంటూ హెచ్చరించారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. 
 
కరోనాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించాలని తలసాని సూచించారు. పైసా ఇవ్వకుండా బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెంత గగ్గోలు పెట్టినా సచివాలయం కట్టి తీరుతాం అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చి చెప్పారు.