శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

తెలంగాణలో మసాలా ఘాటు

పండగలు కానీ, మరే శుభ కార్యాలు ఏమైనా కానీ కమ్మని రుచులతో విందు చేసుకుంటాం తినే ఆహారం ఘుమఘుమలాడేందుకు వాటిలో మసాలాలు దంచికొడతాం.

దేశంలోని ఆయా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మసాలా దినుసుల వినియోగం అధికంగా ఉందని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వేలో తేలింది. మసాలా దినులనే విత్తన సుగంధ ద్రవ్యాలు అని కూడా అంటారు ఇందులో ధనియాలు, జీలకక్ర, మెంతులు, సోంపు, వాము వంటి 17 రకాల ఉత్పత్తుల వినియోగం రాష్ట్రంలోనే అధికంగా ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
 
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్‌ ఎఎ ఆర్‌ ఎం సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం తెలంగాణలో తలసరి సగటున రోజుకు 21 గ్రాములు, నెలకు 640 గ్రాములు సంవత్సరానికి 7.58 కిలోల సుగంధ ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు తేలింది. తెలంగాణ రాష్ట్ర జనాభాకు సంవత్సరానికి 2.31 లక్షల మెట్రిక్‌ టన్నుల సుగంధ ద్రవ్యాల వినియోగం అవుతున్నట్టు సర్వేలో తేలింది.

నిపుణుల అంచనా ప్రకారం వీటి విలువ 1451 కోట్లుగా తేల్చారు. ఇందులో పసుపు ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి, చింత పండు వంటి ఉత్పత్తుల పరిమాణం 2,02,890 మెట్రిక్‌టన్నులుగా అంచనా వేశారు. వీటి విలువ విషయానికి వస్తే 1251 కోట్ల మేరకు ఉంటుందని తేల్చారు.

ఇక విత్తన సుగంధ ద్రవ్యాల పరిమాణం 28,200 మెట్రిక్‌టన్నులు ఉంటుందని తేల్చారు. దీని విలువ 200 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.
 
ఇదిలా ఉండగా మన రాష్ట్రంలో పసుపు ఎండు మిర్చి వంటివి అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. విత్తన సుగంధ ద్రవ్యాలైన ధనియాలు జీలకర్ర, మెంతులు, సోంపు వాము వంటి పంటలను పండించక పోవడం వల్ల వీటిని ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలంగాణ ఉద్యాన వన శాఖ అధికారులు తెలిపారు.

మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులు గుజరాత్‌, రాజస్దాన్‌ రాష్ర్టాల వాతావరణ పరిస్థితులు ఇంచు మించు ఒకే రకంగా ఉన్నప్పటికీ వీటి సాగు మాత్రం మన వద్ద తక్కువగా వుందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఉద్యానవనశాఖ సంచాలకులు మార్చి ,2019లో జాతీయ విత్తన సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం (ఎన్‌ఆర్‌సిఎస్‌ఎస్‌) అజ్మీర్‌ను సందర్శించారు.

అక్కడి శాస్త్రవేత్తలతో తెలలంగాణ రాష్ట్రంలో ఈ పంటల సాగుకు గల అవకాశాన్ని చర్చించారు. ఈ పంటల ఆవశ్యకత, లోటునుపూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పంట కాలనీల ద్వారా విత్తన సుగంధ ద్రవ్యాల విస్తీర్ణం పెంచాలంటే 1.15 లక్షల ఎకరాలు అవసరమని గుర్తించారు.

అంతే కాకుండా ధనియాలు, జీలకర్ర, మెంతులు సోంపు వాము సాగును ప్రోత్సహించడానికి సమీకృత అభివృద్ది పథకం (ఎంఐడిహెచ్‌) 2019- 20 సంవత్సరానికి 100 ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రాలను పైలెట్‌ ప్రాజెక్టుగా రైతుల పొలాల్లో చేపట్టాలని సన్నామాలు చేస్తున్నారు. దీనికి అవసరమైన విత్తనాలను కూడా అజ్మీర్‌లోని జాతీయ విత్తన సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం నుంచి తెప్పిస్తున్నారు.
 
సుగంధ ద్రవ్యాల సాగుపై 15న రాష్ట్ర స్థాయి సదస్సు
విత్తన సుగంధ ద్రవ్యాల పంట సాగుపై తెలంగాణ రైతాంగానికి అవగాహనకల్పించేందుకు, ఈ పంటలు పండించడానికి గల ఆవశ్యకత, అవకాశాలపై అజ్మీర్‌లోని జాతీయ విత్తన సుగంధ ద్రవ్యాల పరిశోధనా కేంద్రం సహకారంతో మంగళవారం రాష్ట్రస్థాయి రైతు అవగాహనా సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు.

ఈ సదస్సు ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ రైతులు సుగంధ ద్రవ్యాల సాగు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.ఈ సదస్సులో నిర్మల్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి , నల్గొండ జిల్లాల నుంచి సుగంధ ద్రవ్య సాగు ప్రదర్శన క్షేత్రాలకు ఎంపిక చేయబడిన ఔత్సాహికులు, అభ్యుదయరైతులు దాదాపు 200 మంది ఈ సదస్సులో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు.