1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (20:26 IST)

టీఆర్ఎస్ కుక్కను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది: వైయస్ షర్మిల

వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర 9వ రోజు గురువారం దిగ్విజయంగా కొనసాగింది. ఉదయం 10.30 నిమిషాలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడు గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా, కప్పపహాడ్, తుర్కగూడ గ్రామం, చెర్లపటేల్ గూడ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చేరుకుంది.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోకి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రవేశించగా 100కిలోమీటర్లకు చేరుకుంది. పాదయాత్ర 100 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రచార కమిటీ కోర్డినేటర్ నీలం రమేష్ శిలాఫలకాన్ని, వైయస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైయస్ షర్మిలతో పాటు వైయస్ విజయమ్మ ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైయస్ షర్మిల, వైయస్ విజయమ్మ గారు పావురాలను విడిచి స్వేచ్చకు స్వాగతం పలికారు. అనంతరం వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైయస్ విజయమ్మ గారు, వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల మాట్లాడారు. 
 
వైయస్ విజయమ్మ మాట్లాడుతూ...
నీకు కష్టంగా లేదా అని షర్మిలను అడిగితే, అమ్మా నాన్న చనిపోయి 12 సంవత్సరాలు అవుతున్నా ఎవరూ మర్చిపోలేదని, ఆయన వారి గుండెల్లో సజీవంగా ఉన్నాడమ్మా అని చెప్పింది. ఇది చాలా పెద్ద పని అని, జాతీయ పార్టీలు కూడా ఇందులో ఉన్నాయని చెప్పాను.

పైన నాన్న ఆశీస్సులు తనకు ఉన్నాయని, పేదల బాధలు పంచుకుంటానని చెప్పింది. ఆమె పట్టుబట్టి అనుకున్నది సాధించే వరకు వదలదు. ఆమె సంకల్పబలంతో సీఎం అవుతుందని చెబుతున్నాను. వైయస్ఆర్ చెప్పినట్టు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రకు మించి మరొకటి లేదని, సంక్షేమం, స్వయం సమృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతోందని, వైయస్ఆర్ లానే షర్మిల పాదయాత్ర కూడా చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు.
 
కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది....
మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై వైయస్ షర్మిల గారు స్పందించారు. చందమామను చూసి కుక్క మొరగడం సహజం. కుక్కకు కుక్క బుద్ధి ఎక్కడ పోతుంది. ఈ రోజు సంస్కారం లేని కుక్క టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉంది. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ మంత్రి కుక్కకు కవిత ఏమవుతుందో ప్రజలు అడగాలని ప్రశ్నించారు.

నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తే హేళన చేస్తారా..? ఈ కుక్కను తరిమికొట్టే రోజు చాలా దగ్గరలోనే ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు దిష్టి బొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటంపై మహిళలలు తీవ్రంగా వ్యతిరేకించారు.