గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (10:52 IST)

కరోనాపై కేసీఆర్ యుద్ధం.. చట్టసభ సభ్యుల మద్దతు.. రూ.500 కోట్ల విరాళం

తెలంగాణ రాష్ట్రం నుంచి కరోనా వైరస్‌ను తరిమికి కొట్టేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటూ, 24 గంటల పాటు సమీక్షలు జరుపుతూ పర్యవేక్షిస్తున్నారు. అలాగే, ప్రజాప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అలాంటి సీఎం కేసీఆర్‌కు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అండగా నిలబడ్డారు. వారంతా కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఆ మొత్తం రూ.500 కోట్లు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. 
 
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సాయం అందించడానికి, కరోనా కట్టడికి తమవంతుగా ముందుకొచ్చారు. ఒకనెల వేతనం, ఏడాది నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మొత్తం దాదాపు రూ.500 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. 
 
ఒక్కో ఎంపీకి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏడాదికి ఐదుకోట్లు మంజూరవుతాయి. తెరాస పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు 16 మందికి మంజూరయ్యే మొత్తం రూ.80 కోట్లు సీఎం సహాయనిధికి మళ్లించనున్నారు. అలాగే, తమ ఒక నెల వేతనాన్ని కూడా అందించనున్నారు. 
 
ఇందుకు సంబంధించిన కాన్సెంట్‌ లెటర్‌ను టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, ఉపనాయకుడు బండ ప్రకాశ్‌, లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు అందజేశారు. 
 
అలాగే, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులుసహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులతోపాటు, ఒకనెల జీతాన్ని సీఎంఆర్‌ఎఫ్‌కు ఇవ్వనున్నట్టు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం ప్రకటించింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి నియోజకవర్గ అభివృద్ధికి ఏడాది రూ.3 కోట్లు విడుదలవుతాయి.