1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (18:08 IST)

కవితను ఎంపీగారూ అని పిలిచేందుకు ఇబ్బందిగా ఉంది.. నా భార్య సలహా తీసుకున్నా: కేటీఆర్

నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన జనహిత ప్రగతి సభలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ కవిత కూడా పాల్గొన్నారు. తొలిసారిగా కవిత, కేటీఆర్ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడు

టీఆర్ఎస్ ఎంపీ కవిత ఇటీవల పాల్గొనే కార్యక్రమాలు హాస్యాన్ని పండిస్తున్నాయి. ఇటీవల తెరాస ఎంపీ కవితమ్మ ఉన్న వేదికపైనే మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడు మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. ఆపై జై తెలంగాణ, జై కవితమ్మ అంటూ కవర్ చేసుకున్నారు. బుధవారం మల్లారెడ్డి తనకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీల వార్షిక వేడుకలు మేడ్చల్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ఎంపీ కవితను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మల్లారెడ్డి జై తెలుగుదేశం అన్న మాటను ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు కవిత సూపర్‌గా కవర్ చేశారు. 
 
మల్లారెడ్డి 2014 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అందుకే పాతవాసన పోలేనట్టుంది అంటూ కవిత చురకలంటించారు. అలవాటులో పొరపాటేనని.. ఇందులో తన పొరపాటు కూడా వచ్చిందని.. పసుపు రంగు ధరించానని.. అంతమాత్రాన టీడీపీకి చెందినట్లు కాదని ఎంపీ కవిత కవర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇదే విధంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన జనహిత ప్రగతి సభలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ కవిత కూడా పాల్గొన్నారు. తొలిసారిగా కవిత, కేటీఆర్ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి కవిత అని పిలిచి అలవాటు పడ్డానని, ఉన్నట్టుండి.. ఎంపీగారు, గౌరవనీయులు అని పిలవాలంటే కొంత ఇబ్బందిగా ఉందన్నారు. దీంతో సభలో నవ్వులు చోటుచేసుకున్నాయి. తనను, కవితను నాయకులుగా, వక్తలుగా తీర్చిదిద్దేందుకు తమ తండ్రి ప్రయత్నించలేదని, తెలంగాణ ఉద్యమమే తమను నేతలుగా నిలిపిందని కేటీఆర్ అన్నారు.
 
అలాగే ఈ సభకు వచ్చేముందు తన భార్య సలహా తీసుకున్నానని కేటీఆర్ తెలిపారు. ఈ సభలో అందరికంటే ముందు తనను మాట్లాడవద్దని, పోచారం శ్రీనివాస రెడ్డిగారు, డీ శ్రీనివాస్ గారు, కవిత మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడావని సూచన ఇచ్చిందన్నారు. అందరూ మాట్లాడేంతవరకు చప్పడు చెయ్యక కూర్చోమని సూచించిందన్నారు.

చివర్లో అవకాశం ఎలాగో వస్తుంది కనుక.. ఇక అన్నీ వాళ్లు మాట్లాడేశారని.. తాను చెప్పేందుకు కొత్తగా ఏమీ లేదని.. మెల్లగా జారుకోవాల్సిందిగా ఆమె సూచించినట్లు కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తన పరిస్థితి అలాగే ఉందని కేటీఆర్ చెప్పడంతో.. సభలో పాల్గొన్న వారంతా నవ్వేశారు.