1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (16:52 IST)

గవర్నర్ నోరు పారేసుకోవడం మానుకోవాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

indrakaran reddy
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరుగా మండిపడుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఓ నివేదిక సమర్పించినట్టు సమాచారం. పైగా, ప్రభుత్వ ఉన్నతాధికారులైన సీఎస్, డీజీపీల తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పనిలోపనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. గవర్నర్‌తో తమకెలాంటి పేచీ లేదని స్పష్టం చేశారు. అయితే మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. గవర్నర్ నోరు పారేసుకోవడం మానుకోవాలంటూ హితవు పలికారు. తమిళిసై వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారంటూ ఘాటైన విమర్శలు చేసారు. ప్రభుత్వం ఎక్కడ అవమానించిందో గవర్నర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
గవర్నర్ తన పరిధిలో ఉంటే ప్రతి ఒక్కరూ గౌరవిస్తారన్నారు. ఉగాది నాడు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా యాదాద్రికి వెళ్లారంటూ పేర్కొన్నారు. కేవలం 20 నిమిషాల ముందు చెబితే ప్రోటోకాల్ పాటించడం ఎలా సాధ్యపడుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.