శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (08:00 IST)

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం : వేలానికి పేరు నమోదు చేసుకున్న బెంగాల్ మంత్రి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకు చేరుకుని జట్టు కోసం కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈ ఆటగాళ్ళ వేలం పాటల కోసం వెస్ట్ బెంగాల్ క్రీడల మంత్రి మనోజ్ తివారీ తన పేరును నమోదు చేసుకున్నారు. ఈయన ప్రారంభ ధర రూ.50 లక్షలుగా పేర్కొన్నారు. 
 
మనోజ్ తివారీ బెంగాల్ క్రికెటర్. గతంలో భారత క్రికెట్ జట్టు తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 12 వన్డేలు, 3 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే, ఐపీఎల్ టోర్నీల్లో ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగూ పూణె సూపర్ జెయింట్ వంటి జట్లకు ప్రాతినిథ్యం వహించారు. 
 
ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో శిభ్‌ పూర్ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం తన మంత్రివర్గంలో క్రీడల శాఖామంత్రిగా మనోజ్ తివారీని సీఎం మమతా బెనర్జీ నియమించారు. 
 
అయితే, మనోజ్ తివారీ చివరగా గత 2018లో ఐపీఎల్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ సారి ఐపీఎల్ టోర్నీలో పాల్గొనాలని ఫిక్స్ అయిన మనోజ్ తివారీ, తన ప్రారంభధర రూ.50 లక్షలుగా ప్రకటించారు. ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న తివారీని ఓ ఫ్రాంచేజీ కొనుగోలు చేస్తుందో వేచి చూడాల్సిందే.