బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మే 2020 (08:42 IST)

గండిపేట రిజర్వాయర్ వద్ద విగతజీవిగా అమెరికన్ పౌరుడు .. ఎలా?

అమెరికా పౌరుడు ఒకరు హైదరాబాద్ గండిపేటలో శవమై కనిపించాడు. తమ కళ్ల ముందు సైక్లింగ్ చేస్తూ వచ్చిన ఈ వ్యక్తి విగతజీవిగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అమెరికా యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ మృతిపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమెరికాకు చెందిన రాబర్ట్ పాల్ (28) ఆయన భార్య అంజలీనాతో కలిసి గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానికంగా ఉండే ఓ బ్యాంకులో పని చేస్తున్నాడు. 
 
అయితే, ప్రతి రోజూ వ్యాయామం నిమిత్తం ఉదయం, సాయంత్రం వేళల్లో సైక్లింగ్ చేసేవాడు. ఇందులోభాగంగా, రెండో రోజుల క్రితం కూడా ఉదయాన్ని సైక్లింగ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆయన భార్య పోలీసులకు సమాచారం చేరవేసింది. 
 
దీంతో పోలీసులు రంగంలోకి దిగి, అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేయగా, అవి ఖానాపూర్ దగ్గరలోని గండిపేట రిజర్వాయర్ ప్రాంతంలో ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లగా, పాల్ మృతదేహం రోడ్డుపై కనిపించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.