కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన కొత్త చిత్రం "పెద్ది" మైసూరులో షూటింగు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరు పర్యటనకు విచ్చేయగా, ఆయన రామ్ చరణ్ను ఆహ్వానించారు. దీంతో రామ్ చరణ్... మైసూరులో సీఎం సిద్ధరామయ్యను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషనులో వస్తున్న 'పెద్ది' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ కొన్ని రోజులుగా మైసూరులో జరుగుతోంది. ఈ సమయంలో సీఎం సిద్ధరామయ్య కూడా నగరంలో ఉండటంతో, రామ్ చరణ్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ భేటీలో రామ్ చరణ్ ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించగా, సిద్ధరామయ్య కూడా చెర్రీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సమావేశంలో ఇద్దరూ ప్రధానంగా సినిమాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం.
పెద్ది' చిత్రానికి సంబంధించి మైసూరులో ప్రస్తుతం ఓ భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. ఏకంగా వెయ్యి మంది డ్యాన్సర్లతో ఈ పాటను ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేసేలా ప్లాన్ చేశారు.