1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:16 IST)

'కాషాయదండు'లో చేరికపై తమిళ హీరో క్లారిటీ!

తమిళ యువ హీరోల్లో ఒకరైన విశాల్.. భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిపై ఈ హీరో తాజాగా క్లారిటీ ఇచ్చాడు. త్వరలో తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని తేల్చిచెప్పారు.
 
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో సినీ ప్రముఖులపై రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఇందులోభాగంగా, బీజేపీ విశాల్‌ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, విశాల్‌ బీజేపీలో చేరనున్నారని, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మురుగన్‌ కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్‌ అడిగారని ప్రసార మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. దీంతో ఆదివారం మధ్యాహ్నం విశాల్‌ ఓ తమిళ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాను బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవాలని స్పష్టం చేశారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. 
 
కాగా, విశాల్ గతంలో నడిగర్‌ సంఘం, సినీ నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకుని, మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానానికి నిర్వహించి ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కానీ, చివరి నిమిషంలో అది తిరస్కరణకులోనైంది.