గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (19:56 IST)

ముంబైను వీడిపోతానంటున్న కంగనా రనౌత్.... ఎందుకని?

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మరోమారు ఫైర్ అయింది. ఈ దఫా ముంబై పోలీసులతో మహారాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరింది. హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్, ముంబై పోలీసుల ఆదేశాలను సంతోషంగా స్వీకరిస్తానని ప్రకటించారు. కావాలంటే తనకు డ్రగ్ టెస్టులు చేసుకోవచ్చని, తన కాల్ రికార్డులు పరిశీలించుకోవచ్చని సూచించారు. 
 
మాదక ద్రవ్యాల విక్రేతలతో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే తన తప్పును అంగీకరించి ముంబైని శాశ్వతంగా విడిచి వెళ్లిపోతానని బహిరంగంగా ప్రకటించారు. త్వరలోనే ముంబై పోలీసులను, హోంమంత్రిని కలిసేందుకు ఎదురుచూస్తున్నానని కంగనా వెల్లడించారు.
 
కాగా, ఇటీవల ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో కంగనా రనౌత్ పోల్చింది. అప్పటి నుంచి కంగనాపై శివసేన నేతలు మండిపడుతున్నారు. అలాగే, మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తమ అధికార బలాన్ని ప్రయోగిస్తూ బెదిరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అందుకే కంగనాకు కేంద్ర వై ప్లస్ భద్రతను కల్పించింది.
 
మరోవైపు, కంగన రనౌత్‌కు ముంబై ఉత్తర బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి అండగా నిలిచారు. కంగనాపై బీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని... అందుకే ఆమెకు మద్దతుగా ఉంటామన్నారు. 
 
కంగనా కార్యాలయాన్ని కూల్చేస్తామని నిన్న చెప్పిన అధికారులు... ఈరోజు ఒక నోటీసును అతికించి వెళ్లిపోయారని... ఆఫీసులో జరుగుతున్న పని వల్ల నీరు లీక్ కాకుండా చూసుకోవాలని ఆ నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. కంగనా పట్ల కార్పొరేషన్ అభ్యంతరకరంగా వ్యవహరిస్తోందని... రేపు తాను ముంబైకి వెళ్తానని, అప్పుడు వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు.
 
ఎవరికైనా ఏ ప్రభుత్వమైనా అన్యాయం చేయాలనుకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని గోపాల్ శెట్టి అన్నారు. కంగనాను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా టార్గెట్ చేసిందా? లేక అధికారుల ద్వారా ఆమెపై కక్ష సాధింపులకు దిగిందా? అనే విషయం తేలాల్సి ఉందని చెప్పారు. 
 
ఒక వేళ కంగనా కార్యాలయం చట్ట విరుద్ధమైన నిర్మణమైతే దాన్ని కూల్చి వేయవచ్చని... అయితే, ఆమెపై చర్యలకు దిగిన సమయం పలు సందేహాలకు తావిస్తోందని అన్నారు. తాను మూడు పర్యాయాలు కార్పొరేటరుగా, పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని... గత ఆరేళ్లుగా ఎంపీగా బాధ్యతలను నిర్వహిస్తున్నానని... ఎవరికైనా అన్యాయం జరిగితే ఊరుకోబోనని బీజేపీ ఎంపీ హెచ్చరించారు.