పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....
సాధారణంగా దొంగతనం చేసే వాళ్లను పట్టుకోవడం పోలీసుల విధి. కానీ, ఇక్కడ పోలీసులే దొంగలుగా మారిపోయారు. ఒక గుర్తు తెలియని శవం దర్యాప్తు కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ పాడు పనికి పాల్పడ్డారు. చివరకు నిఘా నేత్రానికి చిక్కారు. క్లిష్టమైన కేసుల్లో దొంగలు, హంతకులను పట్టించే సీసీ కెమెరాలే ఇపుడు కూడా ఈ పోలీసు దొంగలను పట్టించి ఇచ్చాయి. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మీరట్ నగరంలోని శాస్త్రి నగర్ ఎల్-బ్లాక్ క్రాసింగ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 1:50 గంటల సమయంలో ఇద్దరు పోలీసులు ఒక ఈ-రిక్షాలో మృతదేహాన్ని తీసుకొచ్చి, ఓ దుకాణం ముందు పడేసి వెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు లోహియా నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఈ ఘటనపై మీరట్ ఎస్ఎస్పీ విపిన్ టాడా విచారణకు ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో నౌచాందీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్-బ్లాక్ అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్, సబ్-ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్, కానిస్టేబుల్ రాజేశ్, హోంగార్డు రోహితాస్ను ఈ పని చేసినట్లు తేలింది. పోస్టుమార్టం వంటి అధికారిక ప్రక్రియల నుంచి తప్పించుకోవడానికే వారు ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎస్ఎస్పీ విపిన్ టాడా వెంటనే ఎస్సె జితేంద్ర, కానిస్టేబుల్ రాజేశ్ను సస్పెండ్ చేసి, హోంగార్డు రోహితాతాస్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తును ఎస్పీ (సిటీ) ఆయుష్ విక్రమ్ సింగ్కు అప్పగించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.