మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (09:07 IST)

హీరో భార్యతో అమర్యాదకరంగా ప్రవర్తించిన మహేష్... సిగ్గులేదా అంటూ గొడవకు దిగిన వరుణ్

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున హోస్ట్‌గా తెలుగులో ప్రసారమవుతున్న రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్. ఇది గతవారం మొదలైంది. ఈ షో ప్రారంభమై వారంరోజులు కూడా పూర్తికాకముందే హౌస్‌లో గొడవలు, ఘర్షణలు జరుగుతూ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ముఖ్యంగా, గురువారమైతే కంటెస్టెంట్స్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. 
 
అంతకుముందు జరిగిన వంటగది గొడవను ప్రేక్షకులు మరిచిపోకముందే మరో గడవ మొదలైంది. తన చపాతీని మరెవరో తినేశారని పునర్నవి, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌‌ను సరిగా ఉపయోగించుకోలేదని, తన భార్యకు మర్యాద ఇచ్చి మాట్లాడాలని వరుణ్‌ సందేశ్‌ గొడవలు పడగా, మధ్యలో జాఫర్‌, హేమ, బాబా భాస్కర్‌, శ్రీముఖిలు కాస్త వినోదాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ హీరో వరుణ్ సందేశ్ శాంతించలేదు. తన భార్య పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిన మహేష్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సిగ్గు లేదా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 
 
అసలు వరుణ్ సందేశ్ భార్య వితిక, మహేష్‌ల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. బ్యాటరీలు మార్చుకునేందుకు వెళ్లే రూమ్‌ డోర్‌ వద్ద మహేశ్ నిలుచున్న వేళ, తాను వెళుతుంటే మర్యాద లేకుండా మాట్లాడాడంటూ వితిక ఆరోపించింది. ఈ ఆరోపణతో ప్రారంభమైన చిన్న గొడవ కాస్త తారా స్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం కూడా మహేశ్ తనతో అలాగే మాట్లాడాడని వితిక ఆరోపించింది. ఈలోగా అటుగా వచ్చిన వరుణ్ సందేశ్, వేలు చూపుతూ, తన భార్యకు మర్యాదిస్తూ మాట్లాడాలని హెచ్చరించాడు. 
 
తనవైపు వరుణ్ వేలు చూపించి వార్నింగ్ ఇవ్వడంతో మహేష్ కోపంతో రగిలిపోయాడు. "ఏంటి వేలు చూపిస్తున్నావ్. కొడతావా? అని గద్దిస్తూ, మీదకెళ్లాడు. ఈ ఘటనను చూసి సర్దిచెప్పేందుకు రాహుల్ ప్రయత్నించగా, అతనిపైనా మహేశ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇక వరుణ్ అయితే, 'సిగ్గులేదా? ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకో' అంటూ మరోసారి రెచ్చిపోయాడు. ఇక నేటి ఎపిసోడ్‌లో ఈ గొడవ కంటిన్యూ అవుతుందో లేక మరో గొడవ మొదలవుతుందో చూడాలి.