1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (11:03 IST)

కైకాల సత్యనారాయణ ప్రతిభను గుర్తించని ప్రభుత్వాలు

kaikala
సినీనటుడు కైకాల సత్యనారాయణ ప్రతిభను ఏ ఒక్క ప్రభుత్వం గుర్తించలేకపోయింది. దీంతో ఆయన సినీ కెరీర్‌లో ఆ ఒక్కటి మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోయింది. అదే.. ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డు. దాదాపు 775కు పైగా చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణకు ఒక్కటంటే ఒక్క నంది అవార్డు వరించలేదు. దీనికి కారణం ఆయన ప్రతిభను ఏ ఒక్క ప్రభుత్వం గుర్తించలేక పోయింది. ఫలితంగా కైకాలకు నంది అవార్డు తీరని కోరికగా మిగిలిపోయింది.
 
కాగా, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిల్మ్ నగరులోని ఆయన నివాసంలో కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కైకాల భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులంతా ఆయన నివాసానికి తరలివస్తున్నారు. 
 
దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న కైకాకల.. ఎన్నో పాత్రల్లో మెప్పించారు. ఆలరించారు. మూడు తరాల నటులతో కలిసి నటించారు. తన నటనతో ఎన్నో పాత్రలకు ఆయన వన్నె తెచ్చారు. జీవంపోశారు. ఫలితంగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ, ఆయన నటనకు అవార్డులు, పురస్కారాల రూపంలో పెద్ద గుర్తింపు రాలేదని చెప్పాలి. 
 
గత 1994లో ఆయన నిర్మించిన బంగారు కుటుంబం చిత్రానికి నంది అవార్డు వచ్చింది. 2011లో సత్యనారాయణకు రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది. 2017లో ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. అనేక ప్రైవేటు సంస్థలు కైకాలకు పలు అవార్డులు అందించినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఆయనకు తగిన గుర్తింపు రాలేదు. 
 
నటుడిగా ఒక్కసారి కూడా ఆయనకు నంది అవార్డు దక్కలేదు. భారత ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు ఎలాంటి పౌరపురస్కారం వరించలేదు. ఆయన అవార్డులు గెలుచుకోలేకపోయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసులను మాత్రం గెలుచుకుని వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.