వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు
పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన "ఎల్2 ఎంపురాన్" చిత్రం వివాదాల నడుమ భారీ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలోని అనేక సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని పేర్కొంటూ ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులతో పాటు ఆందోళనకారులకు హీరో మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు.
అయితే, ఆ చిత్ర కలెక్షన్లపై ఈ వివాదాలు ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఫలితంగా కేవలం నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టాయి. ఫలితంగా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరిన తొలి మలయాళ చిత్రంగా 'ఎంపురాన్' రికార్డు సృష్టించింది. గత నెల 27వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకోవడంతో భారీ వసూళ్ళు రాబడుతోంది.
ఈ చిత్రంలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించారనే విమర్శలు, వివాదాలు కొనసాగుతున్నప్పటికీ సినిమాకు కలెక్షన్లు పెరుగుతుండటం గమనార్హం. ఇప్పటివరకు "మంజుమ్మల్ బాయిస్" సినిమా పేరిట ఉన్న రూ.200 కోట్ల రికార్డును 'ఎంపురాన్' అధికమించింది. మున్ముందు ఈ సినిమా కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో చిత్ర నిర్మాణ సంస్థ హర్షం వ్యక్తం చేస్తుంది.