1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 జనవరి 2022 (09:17 IST)

కాలేయ వ్యాధితో కన్నుమూసిన హీరో రమేష్ బాబు

తెలుగు చిత్రపరిశ్రమ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న, హీరో రమేష్ బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన శనివారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా, గుండెపోటుతో చనిపోయారు. ఆయన వయసు 56 యేళ్లు. 
 
గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన శనివారం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో గచ్చిబౌలిని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చి చనిపోయారు. 
 
దీంతో టాలీవుడ్‌లో విషాదచాయలు అలముకున్నాయి. ఆయన మరణంతో పలువురు సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రమేష్ భౌతికకాయం ఏఐజీ ఆస్పత్రిలో ఉంచగా, ఆదివారం ఉదయం ఇంటికి తరలించనున్నారు. 
 
రమేష్ బాబు బాలనటుడుగా, హీరోగా, నిర్మాతకా చిత్రసీమలో రాణించారు. ఆయన తొలిసినిమా అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రం 1974లో వచ్చింది. తన తండ్రి నటించిన చిత్రాల్లో తొలుత నటించిన రమేష్ బాబు.. ఆ తర్వాత హీరోగా నటించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. పలు చిత్రాలను నిర్మించారు. 
 
తన సోదరుడు మహేష్ బాబుతో కలిసి అర్జున్, అతిథి వంటి చిత్రాలను నిర్మాంచారు. హీరో మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'దూకుడు' చిత్రానికి రమేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరించారు. ఇదిలావుంటే, హీరో మహేష్ బాబు కరోనా వైరస్ సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్న విషయం తెల్సిందే.