గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (18:00 IST)

'సైరా'కు సై అన్న నయనతార... తమిళనాట గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం వచ్చే నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో నయనతార హీరోయిన్‌ కాగా, అమితాబ్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి అగ్ర తారాగణం నటిస్తోంది. అయితే, ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు దర్శక నిర్మాత భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరుగనుంది. 
 
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. అయితే, గత కొన్ని రోజులుగా ప్రీరిలీజ్ వేడుకలకు నయనతార డుమ్మాకొడుతూ వస్తోంది. ఈ మేరకు ముందుగానే ఆమె అగ్రిమెంట్ చేసుకుంటుందన్న ప్రచారం ఉంది. అందుకే నయనతార 'సైరా' సినిమా ఫంక్షన్‌కి వస్తుందా? అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. అయితే, 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావడానికి ఆమె అంగీకరించిందనేది తాజా సమాచారం. చెన్నైలో తమిళ వెర్షన్‌కి సంబంధించి జరుపనున్న ప్రమోషన్ ఈవెంట్‌కి కూడా ఆమె వస్తుందని చెబుతున్నారు. నయనతార అభిమానులకు ఇది శుభవార్తే. 
 
మరోవైపు, ఈ చిత్రాన్ని తమిళంలో కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. దేశభక్తికి సంబంధించిన ఈ చారిత్రక చిత్రాన్ని, గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తమిళంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు. 'సైరా'లో విజయ్ సేతుపతి కీలకమైన పాత్రను పోషించడంతో అక్కడ కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ వుంది. దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్న విషయం తెల్సిందే.