శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (16:06 IST)

వామ్మో లేడీ వీరాభిమాని... పవన్ కటౌట్‌కు పాలాభిషేకం

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మేనియా సాగుతోంది. ఆయన నటించిన "భీమ్లా నాయక్" చిత్రం శుక్రవారం విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ చిత్రం విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అధికార వైపాకా నేతలు ఒత్తిడితో ప్రభుత్వ అధికారులు పలు ఆటంకాలు సృష్టించారు. సృష్టిస్తున్నారు కూడా. 
 
అయితే, ఫ్యాన్స్ మాస్ ఫాలోయింగ్ ముందు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇవేమీ పని చేయడం లేదు. శుక్రవారం నుంచే ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. కటౌట్‌లు, డప్పులు, నృత్యాలు, పూజలు, ఇలా నానా హంగామా చేస్తున్నారు. 
 
అయితే, ఓ మహిళ అభిమాని అయితే, ఏకంగా కటౌట్‌పైకి ఎక్కి పవన్‌కు పాలాభిషేకం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అవుతుంది. మెడలో ఎర్రటి కండువా ధరించి, పాల ప్యాకెట్‌ను నోటితో చింపి, పవన్ కటౌట్‌పై పాలు పోసింది. పవన్‌కు ఆడవాళ్ళలో మంచి ఫాలోయింగ్ వుంది. కానీ, ఇలాంటి సంఘటన ఎపుడూ చూడలేదు. 
 
కాగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చగా థమన్ సంగీతం సమకూర్చారు. రానా దగ్గుబాటి విలన్. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానరులో చిత్రాన్ని నిర్మించారు.