శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్ మొగరాల
Last Modified: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:22 IST)

ఎన్టీఆర్ అభిమానులారా..? మీ కన్నీళ్లకు నేను బాధ్యుణ్ణి కాను... వర్మ

సీనియర్ ఎన్టీఆర్ చనిపోయి 23 సంవత్సరాలు గడుస్తున్నా తెలుగు ప్రజలు ఆయనను మరచిపోలేదు. ఆయన జీవితంపై తనయుడు బాలకృష్ణ రెండు భాగాలుగా చిత్రాలను తెరకెక్కించగా, ఒకటవ భాగం సంక్రాంతి కానుకగా విడుదలై నిరాశపరచింది. అయితే రెండో భాగాన్ని ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం లక్ష్మీస్ ఎన్టీయార్ చిత్రాన్ని తీస్తున్నాడన్న సంగతి విదితమే. 
 
ట్విట్టర్‌లో రోజుకొక ట్వీట్‌‌తో అందరిలోనూ అంచనాలను పెంచుతున్నాడు. రేపు వాలెంటైన్స్ డే పురస్కరించుకొని టీజర్‌ని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నాడు. అంతే కాకుండా "ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా, రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. 
 
9:27AM కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు" అంటూ ట్వీట్ చేసి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాడు. గతంలో కూడా ఇలాంటి టీజర్ విడుదల సమయంలో సర్వర్ క్రాష్ కావడంతో ఈ సారీ అదే జరగవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా రేపు టీజర్‌ని విడుదల చేసి మహానాయకుడు రిలీజ్ సమయంలో థియేట్రికల్ ట్రైలర్‌ని లాంచ్ చేయనున్నట్లు వర్మ ఇదివరకే ప్రకటించాడు. ఈ చిత్రం సార్వత్రిక ఎన్నికల ముందు పొలిటికల్ హీట్‌ను పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.