శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (17:30 IST)

''సాహో'' నుంచి ఆ ముగ్గురు అవుట్.. అబ్బా.. అంతమందితో కలిసి పనిచేయలేం..

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ తప్పుకున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా సోమవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘సాహో’ షూటింగ్ దాదాపుగా పూర్తవుతున్న సమయంలో సంగీత దర్శకులు సినిమా నుంచి తప్పుకోవడంతో అందరూ షాకయ్యారు.
 
అయితే సినిమా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అన్న విషయంపై శంకర్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘సాహో’ చిత్ర బృందం మరిన్ని పాటలు జోడించాలని భావించింది, దానికి బయటి కంపోజర్లను తీసుకోవాలనుకుంది. ఈ విషయంలో మేము కాస్త అసౌకర్యానికి గురయ్యామన్నారు. సాహో సినిమాకు సంగీత దర్శకులుగా మేమే ఉండాలని అనుకున్నామని, అందుకే మరొకరు రావడం ఇష్టంలేక సినిమా నుంచి తప్పుకున్నామన్నారు. 
 
ప్రస్తుతం సినిమాకు పాటలు కంపోజ్‌ చేసే పనిలోనే ఉన్నట్లు, ఈ మధ్యకాలంలో ఒక సినిమాకు చాలా మంది సంగీత దర్శకులు పని చేయడం చూస్తూనే ఉన్నామన్నారు. ఈ విషయాన్నే నిర్మాణ సంస్థ మాతో చర్చించగా, మాకు ఇష్టంలేదని చెప్పేశాం. ఎందుకంటే ఒక సినిమాకు ఒక సంగీత దర్శకుడే సంగీతం అందిస్తారు. ఫలానా సినిమాకు సంగీతం అందించింది ఫలానా వ్యక్తి అని చెప్పడంతోనే సంగీత దర్శకులకు గౌరవం దక్కుతుందన్నారు.
 
సాహో సినిమా విషయంలో ఈ సినిమాకు సంగీతంతో పాటు నేపథ్య సంగీతం కూడా మేమే అందించాలనుకున్నామని, కానీ నిర్మాణ సంస్థ అందుకు వేరొకరిని నియమించుకుందని చెప్పారు. కనీసం పాటల వరకైనా మమ్మల్ని మాత్రమే తీసుకోవచ్చు కదా? నేను, ఎహసాన్‌, లాయ్‌ కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించాం. మేం మల్టిపుల్‌ కంపోజర్స్‌ అనే ఐడియాను వ్యతిరేకించడంలేదు. కానీ అంతమందితో కలిసి పనిచేయాలంటే మాకు సౌకర్యంగా ఉండదు’ అని వెల్లడించారు శంకర్‌.