శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

"శభాష్ మిత్తు"గా తాప్సీ పన్ను - చెమటోడ్చుతున్న సొట్టబుగ్గల సుందరి!

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ప్రస్తుతం బయోపిక్ కాలం నడుస్తోంది. ఇలాంటి చిత్రాల్లో నటించేందుకు హీరోలతో పాటు... హీరోయిన్లు అమితాసక్తి చూపుతున్నారు. ఇప్పటికే, తెలుగులో మహానటి సావిత్రి పేరుతో వచ్చిన మహానటి చిత్రం మలయాళ బ్యూటీ కీర్తి సురేష్‌కు ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలను సంపాదించి పెట్టింది. అలాగే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. 
 
ఈ క్రమంలో అగ్ర కథానాయిక తాప్సీ.. భారత మహిళా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ అమ్మాయి మిథాలీరాజ్‌ బయోపిక్‌లో నటిస్తోంది. "శభాష్‌ మిత్తు" పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాహుల్‌ దొలాకియా దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభంకానుంది. ఈ చిత్రం కోసం తాప్సీ మూడునెలల పాటు క్రికెట్‌ బ్యాటింగ్‌లో శిక్షణ తీసుకోబోతున్నట్లు తెలిపింది. 
 
'పాత్రలో పర్‌ఫెక్షన్‌ రావాలన్నదే నా తపన. అందుకే మూడు నెలల పాటు క్రికెట్‌లో కఠోర శిక్షణ తీసుకోబోతున్నా. వచ్చే ఏడాది క్రికెట్‌ శ్వాసగా జీవించాలనుకుంటున్నా' అని తాప్సీ చెప్పుకొచ్చింది. ఇదిలావుండగా ప్రస్తుతం తాప్సీ మహిళా అథ్లెట్‌ కథాంశంతో రూపొందిస్తున్న 'రష్మీ రాకెట్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కోసం రన్నింగ్‌లో ప్రాక్టీస్‌ చేయడంతో పాటు ధృడమైన శారీరకసౌష్టవం కోసం కసరత్తులు చేసింది.