శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (19:50 IST)

ఎవరైనా నాపై నిమ్మకాయలు విసిరితే వాటితో జ్యూస్ చేసుకుని తాగుతా (Video)

బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అలియాభట్‌, అనన్యపాండే కంటే అందంగా కనిపించే తాప్సీ, స్వరభాస్కర్‌కు పెద్ద సినిమా అవకాశాలు ఎందుకు రావడం లేదో ఆలోచించుకోవాలంటూ సీనియర్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేసింది. పైగా, తాప్సీ, స్వరభాస్కర్‌కు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అంటే ఇష్టమని, సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి లేదంటూ కంగనా వ్యాఖ్యానించింది. 
 
ఈ వ్యాఖ్యలపై తాప్సీ మండిపడింది. ఘాటుగా కౌంటరిచ్చింది. ఒకరి విషాద మరణాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటూ వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. ఇలాంటి రెచ్చగొట్టే మాటల వల్ల ఇండస్ట్రీలోకి వచ్చే ఔత్సాహిక నాయికల తల్లిదండ్రులు అభద్రతా భావానికి లోనవుతారని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది. 
 
పైగా, 'కరణ్‌జోహార్‌ నాకు ఇష్టమని నేనెక్కడా చెప్పలేదు. ఒకరికి హాయ్‌, హలో అని చెప్పినంత మాత్రాన వారంటే ఇష్టం ఉన్నట్లా? కంగనా రనౌత్‌వి అర్థం లేని మాటలు. సినీరంగంలోకి ప్రతి ఒక్కరు కష్టపడి వచ్చారు. బాధలను చెప్పుకుంటూ సానుభూతి పొందాలనుకోవడం మానసికదౌర్బల్యంగా భావించాలి. 
 
నా మీద ఎవరైనా నిమ్మకాయలు విసిరితే వాటితో జ్యూస్‌ చేసుకోని తాగాలనుకునే ఆశావహ దృక్పథం నాది. ప్రతికూల భావనలకు నేను దూరంగా ఉంటా. ఎవరో చేస్తున్న అసంబద్ధ ఆరోపణలు నా ధైర్యాన్ని దెబ్బతీయలేవు' అంటూ తాప్సీ పన్ను ఘాటుగా స్పందించింది. మరోవైపు, కంగనా రనౌత్ వ్యాఖ్యలపై స్వరభాస్కర్ మాత్రం ఇంకా స్పందించలేదు.