మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
మూత్ర విసర్జనకు చెట్ల చాటుకు వెళ్లిన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఒక గిరిజన మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేసిన ముగ్గురిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.
ఆ మహిళ ఫిర్యాదు ప్రకారం, ఆమె తన మేనల్లుడితో కలిసి అంగుల్లోని చెండిపడ ప్రాంతంలోని ఒక ఆసుపత్రికి వెళ్లి వస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మోటార్ సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇంతలో మార్గమధ్యంలో ఆ మహిళ మూత్ర విసర్జన కోసం వాహనాన్ని ఆపమంది. ఆ తర్వాత రోడ్డు పక్కనే వున్న అటవీ ప్రాంతంలోని చెట్ల చాటుకి వెళ్లింది. ఆమె అలా ఒంటరిగా రావడాన్ని ముగ్గురు కామాంధులు గమనించారు. వారంతా ట్రాక్టర్పై వచ్చి తనపై లైంగిక దాడి చేశారని మహిళ ఆరోపించింది.
ఆ వ్యక్తులు తనను బలవంతంగా ప్రధాన రహదారి నుండి కొంత దూరంలో ఉన్న ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తనపై అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయారు. ఆ మహిళ ఇంటికి చేరుకుని తన కుటుంబ సభ్యులకు ఈ సంఘటన గురించి తెలియజేసింది.
ఆగస్టు 5న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆగస్టు 6న ఈ నేరానికి సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఉపయోగించిన ట్రాక్టర్, రెండు మొబైల్ ఫోన్లు, నేరం జరిగిన సమయంలో నిందితులు, బాధితురాలు ధరించిన దుస్తులు సహా అనేక నేరారోపణ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.