బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (17:13 IST)

వెంటిలేటర్‌పై తమిళ విలన్ పొన్నాంబళం - కిడ్నీ వ్యాధితో ఆస్పత్రిలో చేరిక

ప్రముఖ తమిళ విలన్ పొన్నాంబళం అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు కిడ్నీ సమస్య ఉత్పన్నంకావడంతో చైన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ మాస్కుతో ఊపిరి పీల్చుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. పొన్నాంబళంకు అనారోగ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. 
 
పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలిసి విచారం వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులతో ఫోనులో మాట్లాడి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. చికిత్సకు ఆర్థికసాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, పొన్నాంబళం పిల్లలను కూడా చదివించే బాధ్యతను స్వీకరిస్తానని భరోసా ఇచ్చారు. పొన్నాంబళం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా కమల్ తన సిబ్బందికి సూచనలు చేశారు.
 
ఇకపోతే 'స్టంట్ మ్యాన్' అనే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన పొన్నాంబళం ... కమలహాసన్, రజనీకాంత్‌లతో పాటు.. పలువురు హీరోలతో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనూ అనేక మంది స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. కొంతకాలం కిందట తమిళ బిగ్ బాస్‌లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.