శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జులై 2020 (11:10 IST)

కరోనాతో యువకుడు మృతి... రూ.12 లక్షలు బిల్లు వేసిన ప్రైవేటు ఆస్పత్రి!!

కరోనాకు వైద్యం పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నాయి. పాజిటివ్ వచ్చిన రోగులను వారం పది రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచుకుని లక్షలాది రూపాయలు బిల్లులు వేస్తున్నాయి. పైగా, ఆ రోగికి నయమవుతుందా అంటే అదీ లేదు. చివరకు చేతిలో మృతదేహాన్ని చూపించి, చేతిలో లక్షల రూపాయలతో కూడిన బిల్లును చేతిలో పెడుతున్నాయి. అంత మొత్తంలో బిల్లు చెల్లించలకే.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేక మృతుల కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
 
తాజాగా తెలంగాణాలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసిది. తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరి గుట్టకు చెందిన 28 ఏళ్ల యువకుడు గత నెల 23వ తేదీన అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. గత నెల 24వ తేదీన నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటిగ్‌ అని తేలింది. 
 
ఆ తర్వాత మరోమారు 26వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అక్కడే రెండు ఉంచి రెండు వారాల పాటు చికిత్స అందించారు. చివరకు అతను కోలుకోలేదు కదా... మంగళవారం ఉదయం మృతి చెందాడు. యువకుడి వైద్యం కోసం బాధిత కుటుంబం అప్పటికే రూ.6.50 లక్షలు చెల్లించింది.
 
మంగళవారం యువకుడి మృతి అనంతరం మొత్తం రూ.12 లక్షలు అయిందంటూ ఆసుపత్రి యాజమాన్యం బిల్లు చేతిలో పెట్టడంతో అసలే బాధలో ఉన్న కుటుంబం అది చూసి షాక్‌కు గురైంది. పొలం అమ్మగా వచ్చిన రూ.6.50 లక్షలను ఇప్పటికే కట్టేశామని, ఇక తమ వద్ద పైసా కూడా లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వారి ఆందోళనతో దిగొచ్చిన యాజమాన్యం చివరికి యువకుడి మృతదేహాన్ని కుటుంబానికి అందించడంతో కథ సుఖాంతమైంది.