శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 30 మార్చి 2019 (15:00 IST)

'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'కు అనూహ్య స్పందన... హైదరాబాద్ వెళ్లి సినిమా చూసిన ఉండవల్లి

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరెక్కించిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా తెలంగాణాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి విడుదలైన తొలి ఆట నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ముఖ్యంగా, తొలి రోజున ఊహించనదానికంటే మంచి స్పందనతో పాటు.. వసూళ్లు కూడా ఆశించిన మేరకు ఉండటంతో చిత్ర నిర్మాతలు ఖుషీఖుషీగా ఉన్నారు. 
 
ఈ చిత్రం ఎన్టీఆర్ - లక్ష్మీపార్వతిలతో పాటు ఎన్టీఆర్ అల్లుడుగా చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలను ప్రధానంగా చేసుకుని చిత్రీకరించారు. దీంతో ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయడానికి వీల్లేదంటూ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయం కావడంతో తమ పార్టీపై ఈ చిత్ర ప్రభావం పడుతుందని వారు చేసిన వాదనలతో ఏపీ హైకోర్టు అంగీకరించి, చిత్రం విడుదలపై స్టే విధించింది. దీంతో ఏప్రిల్ 13వ తేదీన ఈ చిత్రం ఏపీలో విడుదలకానుంది. 
 
ఇదిలావుంటే. తెలంగాణలోనూ, ఓవర్సీస్‌లోను ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలా థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. విడుదలైన అన్ని ప్రాంతాలలోను తొలి రోజున ఈ సినిమా రూ.4 కోట్ల గ్రాస్‌ను సాధించినట్టుగా చెబుతున్నారు. శని .. ఆదివారాల్లో ఈ జోరు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం ఏపీలో విడుదల కాకపోవడంతో పాటు చిత్రానికి వచ్చిన టాక్‌ కారణంగా ప్రముఖ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్‌కు వచ్చిమరీ ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ చిత్రానికి గీత రచయిగా పని చేసిన సిరాశ్రీ, ‘ఎమెస్కో’ అధినేత విజయ్ కుమార్‌లతో కలిసి ఉండవల్లి ఈ చిత్రం చూశారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను సిరాశ్రీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.