శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 27 జులై 2019 (11:25 IST)

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్.. 15 నిమిషాలు పోలీసులను పక్కనబెడితే?

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్రం మరోసారి దృష్టి పెట్టింది. 15 నిమిషాలు పోలీసులను పక్కనపెడితే దేశంలోని హిందూ-ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తామంటూ 2013లో అక్బరుద్ధీన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అక్భరుద్ధీన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ ఆయనపై నమోదైన అన్ని కేసులను తిరగదోడి కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఇందుకు కారణం రెండు రోజుల క్రితం కరీంనగర్ సభలో చేసిన వ్యాఖ్యలేనని సమాచారం. కరీంనగర్‌లో మాట్లాడిన అక్బరుద్ధీన్, 2013లో తాను చేసిన వ్యాఖ్యల నుంచి ఆరెస్సెస్ వారు ఇంకా కోలుకోలేదని, అందుకే తనను ద్వేషిస్తున్నారంటూ నాటి వ్యాఖ్యలను గుర్తు చేశారు. దీంతో స్పందించిన బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ అక్బరుద్దీన్‌పై ఫిర్యాదు చేశారు. 
 
ఫలితంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యల్లోని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్ర హోంశాఖను కోరినట్టు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. అక్బర్‌పై ఇప్పటి వరకు నమోదైన కేసులు, చార్జిషీట్లు తదితర వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నట్టు సమాచారం.