శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (11:59 IST)

అయోధ్యలోనే రాముడు పుట్టాడు... వివాదాస్పద భూమి న్యాస్‌కు : సుప్రీంకోర్టు

దశాబ్దాల కాలం పాటు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు శనివారం చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది.
 
అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాగే, ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచన చేసింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో 'అయోధ్య ట్రస్ట్'ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
 
ఈ కేసుకు అధికరణం 47 వర్తించదని సీజేఐ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందన్నారు. 12 ఏళ్ల తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డు ఈ కేసులో వ్యాజ్యం దాఖలు చేసిందని చెప్పారు. తమ నిర్ణయానికి ముందు ఇరు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. 
 
 
అంతేకాకుండా, అయోధ్య వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మాణానికి ముందు ఒక నిర్మాణం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ స్పష్టం చేశారు. మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదని తెలిపారు. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని చెప్పారు.
 
అయోధ్యను రామ జన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారని గొగోయ్ అన్నారు. మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని స్పష్టం చేశారు. శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని వెల్లడించారు. 
 
అలాగే, రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని సీజేఐ చెప్పారు. గతంలో ఈ వివాదాస్పద స్థలంలో రెండు మతాలూ ప్రార్థనలు చేసేవని తెలిపారు.
 
ఈ కేసు దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించిందని గొగోయ్ అన్నారు. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదని చెప్పారు. మసీదును ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని ఇప్పటికే హైకోర్టు చెప్పిందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందన్నారు.