గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2019 (14:09 IST)

చిరుతపులి చేతిలో కమలం : మేం ఆడించినట్టు ఆడాల్సిందే... శివసేన

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేన చక్రం తిప్పుతోంది. ఇపుడు రిమోట్ కంట్రోల్ తమ చేతిలో ఉందనీ, తాము చెప్పినట్టు ఎవరైనా ఆడాల్సిందేనంటూ కమలనాథులను సుతిమెత్తగా హెచ్చరించింది. 
 
ఇటీవల వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - శివసేన పార్టీలతో కూడిన కూటమి సంపూర్ణ మెజార్టీ సాధించింది. అయితే, అటు బీజేపీకి గానీ, ఇటు శివసేనకు గానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు లేవు. దీంతో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
దీన్నే తమకు అనుకూలంగా శివసేన మార్చుకుంది. 2014 ఎన్నికల్లో 63 సీట్లలో విజయం సాధించిన శివసేన.. 2019 ఎన్నికల్లో 56 స్థానాల్లో గెలుపొందింది. మరోవైపు, 2014లో 122 సీట్లు గెలుచుకున్న బీజేపీ కూడా ఈ సారి పలు స్థానాలను కోల్పోయింది. 105 నియోజక వర్గాల్లో గెలుపొందింది.
 
ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ దక్కని నేపథ్యంలో శివసేన మద్దతు తప్పనిసరైంది. దీంతో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్‌ను శివసేన తీసుకొచ్చింది. 'శివసేన గతంలో కంటే ఈ సారి తక్కువ స్థానాల్లో గెలుపొందింది. అయినప్పటికీ, రిమోట్ కంట్రోట్ మా పార్టీ చేతిలో ఉంది. ఇటీవల ఓ కార్టూన్ ప్రచురించాం. అందులో మా పార్టీ ఎన్నికల గుర్తు చిరుత పులి చేతిలో కమలం (బీజేపీ ఎన్నికల గుర్తు) ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఇది చక్కగా అభివర్ణించి చెబుతోంది' అని అని తమ పార్టీ పత్రిక సామ్నాలో శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
 
'164 స్థానాల్లో పోటీ చేసి కనీసం 144 సీట్లు గెలుచుకోవాలన్న బీజేపీ వ్యూహాన్ని ఓటర్లు తిప్పికొట్టారు. బీజేపీ అనైతిక ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ ఫలితాలు వచ్చాయి. బెదిరిస్తూ, ఆశచూపుతూ కాంగ్రెస్-ఎన్సీపీ కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని, తద్వారా అసెంబ్లీలో తమ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ భావించింది' అని సంజయ్ రౌత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, 'రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పని అయిపోయిందంటూ వచ్చిన వ్యాఖ్యలను ప్రజలు ఒప్పుకోలేదు. తమ ఓట్ల ద్వారా ఈ విషయాన్ని ప్రజలు తెలియజేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీకి అధికంగా ఓట్లు పడ్డాయి. 2014లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ చేసిన ప్రయత్నాలను శివసేన నిరోధించింది. 2019 ఎన్నికల్లో బీజేపీని శరద్ పవార్ నిరోధించారు' సంజయ్ రౌత్ సామ్నా పత్రికలో పేర్కొన్నారు.