1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 2 నవంబరు 2021 (17:44 IST)

గెలుపు దిశగా ఈటెల రాజేందర్, 18 రౌండ్లకి భాజపా ఆధిక్యం 16,494

హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించే దిశలో వెళుతున్నారు తెలంగాణ మాజీమంత్రి ఈటెల రాజేందర్. హుజురాబాద్ ఉప ఎన్నికలో తొలుత భాజపా-తెరాస మధ్య హోరాహోరీ కనిపించింది కానీ మధ్యాహ్నం తర్వాత ఈటెల రాజేందర్ ఆధిక్యం రౌండు రౌండుకీ పెరుగుతూ వెళుతోంది. ఇక మరో నాలుగు రౌండ్లు మాత్రమే మిగిలి వున్నాయి.

 
మొత్తం 18 రౌండ్లలో కేవలం 8, 11వ రౌండ్లలో మాత్రమే తెరాస అభ్యర్థి ఆధిక్యం కనబరిచాడు. మిగిలిన రౌండ్లన్నింటిలోనూ ఈటెల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు. మరోవైపు ఈటెల ఆధిక్యంలో దూసుకుపోతూ వుండటంతో భాజపా కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.

 
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధఃపాతాళానికి పడిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో వుండగా తెలంగాణలోనూ అదే స్థితి కనబడుతోంది. హుజురాబాద్ ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 15 రౌండ్లు ముగిసే సమయానికి కేవలం 2వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే... ఇక ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది.