1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శుక్రవారం, 4 జూన్ 2021 (16:34 IST)

ఆయనకు ఆ శక్తి వుంటే జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రిని చేయగలడా?: గోవిందానందస్వామి సంచలన వ్యాఖ్యలు

విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానందసరస్వతి. శారదాపీఠం నకిలీ పీఠమన్నారు. వ్యాపారం కోసమే పీఠాన్ని నడుపుతున్నారంటూ ఆరోపించారు. అసలు స్వరూపానందస్వామికి శక్తి ఉంటే జగన్మోహన్ రెడ్డిని ప్రధానమంత్రిని చేయగలడా అంటూ ప్రశ్నించారు.
 
అంతటిదో ఆగలేదు... పీఠాధిపతులకు రాజకీయాలు మాట్లాడకూడదని తెలియదా అంటూ స్వరూపానందేంద్రస్వామిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అలాగే హనుమాన్ జయంతి వేడుకలను టిటిడి నిర్వహించడాన్ని తప్పుబట్టారు గోవిందానందస్వామి. తిరుమలలో టిటిడి హనుమాన్ జయంతి వేడుకలను అసంబద్ధంగా జరుపుతోందన్నారు.
 
జన్మతిథి తెలియదని చెప్పిన టిటిడి మొదట్లో చెప్పి ఆ తరువాత వారే ప్రచురించిన పుస్తకంలో మూడు జన్మతిథిలున్నాయన్నారు. జన్మతిథిని తప్పుగా ప్రచురించారన్నారు. మొదట్లో జపాలీ తీర్థంలో హనుమంతుడు పుట్టారని చెప్పి ఇప్పుడు ఆకాశగంగలో పుట్టారని చెబుతున్నారని, టిటిడి చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. 
 
ఏ జన్మతిథిలో హనుమంతుడు పుట్టాడో తెలియని టిటిడి, హనుమంతుడు ఎక్కడ పుట్టారో ఎలా చెబుతుందని ప్రశ్నించారు. చైత్రమాసంలో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారని.. ఈ నెలలో ఎలా హనుమంతుని జయంతి వేడుకలను నిర్వహిస్తారని ప్రశ్నించారు.
 
భక్తులను టిటిడి మోసం చేస్తోందని.. పండితులను అడక్కుండా హనుమాన్ జయంతి వేడుకలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. టిటిడి తప్పుల మీద తప్పులు చేస్తూనే పోతోందన్నారు. టిటిడితో పాటు స్వరూపానందస్వామిపై గోవిందానందస్వామి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.