శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 నవంబరు 2019 (16:46 IST)

పథకం ప్రకారమే ప్రియాంకా రెడ్డి వాహనం పంక్చర్, అదుపులో నలుగురు

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రియాంకా రెడ్డి హత్యకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియాంకా రెడ్డి పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని దుండగులు ముందస్తు పథకం ప్రకారమే పంక్చర్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె హత్యకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు.
 
టోల్‌గేట్‌కు సమీపంలో ప్రియాంక స్కూటీని పార్క్ చేయడాన్ని ముందుగానే గమనించిన లారీ డ్రైవర్లు, ఆమె తిరిగి వచ్చేలోపు స్కూటీ టైరును పంక్చర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె తిరిగి స్కూటీ కోసం అక్కడికి రాగానే స్కూటీ పంక్చర్ అయిందనీ, దాన్ని బాగు చేయించుకుని వస్తామంటూ మాయమాటలు చెప్పి ఆ తర్వాత ఆమెను సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోది. 
 
ఈ దారుణానికి పాల్పడిన నిందితులు నలుగురిని పోలీసుల అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రియాంకా రెడ్డి స్కూటీని కొత్తూరు మండలం జేపీ దర్గా సమీపంలో కనుగొన్నారు. ఈ వాహనం ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టిన ప్రాంతానికి సమీపంలోనే లభించింది. ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టేందుకు ఆమె స్కూటీపైనే నిందితులు పెట్రోలు బంకుకి వెళ్లి పెట్రోలు తెచ్చినట్లు సిసి ఫుటేజి ద్వారా తెలుస్తోంది. 
 
నిందితులను మరికొద్దిసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. దోషులను కఠినంగా శిక్షిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.