1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (19:00 IST)

దాడి మొదలైంది: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఖాయం

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఖాయం అనిపిస్తోంది. రష్యా ఎఫ్‌ఎస్‌బి భద్రతా సేన సోమవారం ఉక్రేనియన్ భూభాగం నుండి వచ్చిన షెల్ రష్యాలోని రోస్టోవ్ ప్రాంతంలో సరిహద్దు గార్డు పోస్ట్‌ను పూర్తిగా ధ్వంసం చేసిందని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థ నివేదించింది.


రష్యా- ఉక్రెయిన్ మధ్య సరిహద్దు నుండి 150 మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగిందని ఇంటర్‌ఫాక్స్ పేర్కొంది. తూర్పున ఉక్రేనియన్ ప్రభుత్వ దళాలను, రష్యా అనుకూల వేర్పాటువాదులను విభజించే రేఖపై చెదురుమదురు ఘటనలు గురువారం నుండి తీవ్రమయ్యాయి.

 
మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలను శాంతపరచడానికి పారిస్ సమావేశానికి అవకాశం ఉందని ప్రకటించిన తరువాత, పుతిన్- బైడెన్ మధ్య శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం అవశ్యమని క్రెమ్లిన్ తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వైట్ హౌస్ తెలిపింది.

 
ఐతే పరిస్థితులు అలా కనిపించడంలేదు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో సరిహద్దు పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. కాగా చివరిక్షణం వరకూ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగకుండా నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని అమెరికా చెపుతోంది.