గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (17:45 IST)

మహిళ చున్నీ లాగిన మాజీ సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. మహిళ చేతిలోని మైక్ లాక్కొనే క్రమంలో చున్నీని లాగాడు. ఆమె భుజాన్ని నొక్కి బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓ సభ జరిగింది. ఇందులో సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు. అక్కడ ఓ మహిళ ముందు వరుసలో నాయకుల ఎదుట నిల్చుని తమ సమస్యల గురించి చెబుతోంది. ఆమె మాటలకు ఆవేశంతో సిద్ధరామయ్య మైక్ లాక్కున్నారు. 
 
మైక్ లాగినప్పుడు దానితోపాటు ఆమె చున్నీ కూడా భుజం పైనుంచి జారింది. ఆ తర్వాత కూడా ఆమె గట్టిగా మాట్లాడుతుండడంతో 'కూర్చోవమ్మా' అంటూ తోయబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
దీంతో కాంగ్రెస్ నేతలకు మహిళలతో ప్రవర్తించే తీరు తెలియదంటూ బీజేపీ విమర్శలకు దిగింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆ మహిళకు క్షమాపణ చెప్పాలని బీజేపీ సీనియర్ నేత ఎస్.ప్రకాశ్ డిమాండ్ చేశారు. అలాగే సిద్ధరామయ్యపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.