1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 మార్చి 2021 (16:08 IST)

భారత్‌ను 200 ఏళ్లు పాలించిన అమెరికా, హేయ్... మళ్లీ వేసేశారుగా ఉత్తరాఖండ్ సీఎం

ఉత్తరాఖండ్ సీఎం చరిత్రలో చాలా పూర్ అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఆయనకు కనీసం అమెరికాకు ఇంగ్లాండుకు తేడా తెలీడం లేదనీ, అలాంటి వ్యక్తి ఎలా ముఖ్యమంత్రి అయ్యారో అంటూ సెటైర్లు విసురుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఉత్తరాఖండ్ సీఎంపైన ఆ సెటైర్లు ఎందుకు? వివరాలు చూడాల్సిందే.
 
ఇటీవలే మహిళలు టోర్న్ జీన్స్ వేసుకోవడం వల్ల సమాజం పెడదోవలో వెళ్లే ప్రమాదం వుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని 200 ఏండ్ల పాటు పరిపాలించిన అమెరికా కరోనావైరస్ ను అడ్డుకోలేక నానా తంటాలు పడుతోందన్నారు. ఈ మాట వినగానే అక్కడున్నవారు చాలామంది అయోమయానికి గురయ్యారు.
 
భారతదేశాన్ని అమెరికా ఎప్పుడు పరిపాలించిందంటూ కొందరు గట్టిగానే కేకలు వేసారట. కానీ అవేమీ పట్టించుకోని సీఎం అమెరికా దేశం భారతీయులను బానిసలుగా చేసిందని అన్నారు. ఆనాడు భారతీయులను బానిసలుగా చేసుకున్న అమెరికా నేడు కరోనావైరస్‌ను ఎదుర్కొనే విషయంలో తిప్పలు పడుతోందన్నారు. 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో కరోనావైరస్ ను కట్టడి చేయడంలో నరేంద్ర మోదీ విజయవంతం అయ్యారన్నారు. ఈ విషయంలో అమెరికా ఘోరంగా విఫలమైందన్నారు.