శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (14:58 IST)

కేంద్ర వార్షిక బడ్జెట్ : ధరలు తగ్గే వస్తువులు... పెరిగే వస్తువులివే..

budget
కేంద్ర విత్రమంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో అనేక వస్తువులపై వసూలు చేసే సుంకాన్ని తగ్గించారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, కేన్సర్ మందులపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. దీంతో రిటైల్ మార్కెట్లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. 
 
అలాగే, కేంద్రం నిర్ణయంతో బంగారం, వెండి, లెదర్ వస్తువులు, సీఫుడ్ చౌకగా లభించనున్నాయి. పలు వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో ధరలు తగ్గే, పెరిగే అవకాశం ఉన్న కొన్ని వస్తువుల్ని పరిశీలిస్తే.. 
 
ధరలు తగ్గే వస్తువులివే..!
మొబైల్ ఫోన్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ తగ్గించడంతో వినియోగదారులకు స్మార్ట్‌ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ చర్యను మేడిన్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ రంగానికి శుభసూచికంగా పేర్కొంటున్నారు. గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్ల దేశీయ ఉత్పత్తి, ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
 
కేన్సర్ మందులు : మూడు క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. దీంతో ఆ ధరలు తగ్గే అవకాశం ఉంది.
 
బంగారం, వెండి : వీటిపై 6శాతం కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. ఈ చర్యతో రిటైల్ డిమాండ్ పెరుగుతుందని, తద్వారా స్మగ్లింగ్‌ను అరికట్టడంలో దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
 
ప్లాటినమ్ పైనా 6.5 శాతం కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రతిపాదన చేశారు. వెండి, ప్లాటినమ్‌పై బేసిక్ కస్టమ్స్ సుంకం తగ్గించాలంటూ ఎప్పటినుంచో జెమ్స్ అండ్ జ్యువెలరీ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ఇపుడు వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. 
 
సీ ఫుడ్: రొయ్యలు, చేపల మేతపై బేసిక్ కస్టమ్స్ సుంకం 5 శాతానికి తగ్గించారు. తద్వారా వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.
 
సోలార్ ఎనర్జీ భాగాలు : సౌర విద్యుత్ సంబంధిత భాగాలపై సుంకాన్ని పొడిగించకూడదని కేంద్రం ప్రతిపాదించింది.
 
ఫుట్‌వేర్ : లెదర్, ఫుట్‌వేర్‌పై కస్టమ్స్ సుంకం తగ్గించడంతో పాటు ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్ వంటి మినరల్ పై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగిస్తూ ప్రతిపాదించారు.
 
ప్రియం కానున్న వస్తువులు ఇవే... 
అమ్మోనియం నైట్రేట్, నాన్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతానికి పెంచారు. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. 
 
మదర్ బోర్డులపై 5 శాతం దిగుమతి సుంకాన్ని పెంచాలని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.