అండర్-19 ప్రపంచ కప్ : శ్రీలంకపై గెలుపు.. ఫైనల్లోకి భారత్..!
అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోటీల్లో భారత బుడ్డోళ్ల జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 267 పరుగులు సాధించింది. 268 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 42.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. దీంతో 97 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపును నమోదు చేసుకుంది.
ఈ మ్యాచ్లో ధీటుగా రాణించిన అనుమోల్ ప్రీత్ సింగ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక 11న వెస్టిండీస్- బంగ్లాదేశ్ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ పోటీ జరుగనుంది. ఈ పోటీలో గెలిచే జట్టుతో 14న జరిగే ఫైనల్ పోరులో భారత్ తలపడనుంది. భారత్ ఆటగాళ్లలో అన్మోల్ప్రీత్ సింగ్ (72), ఎస్ఎన్ ఖాన్ (59)లు అర్థ సెంచరీలు నమోదు చేసుకోగా వాషింగ్టన్ సుందర్ (43) అర్థ సెంచరీకి 7 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు.
శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టగా, కుమార, నిమేష్లు చెరో రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. శ్రీలంక బ్యాట్స్మెన్లలో మెండిస్ (39), అషాన్ (38), సిల్వ (28), బీఏడీఎస్ సిల్వ (24)లు మెరుగ్గా రాణించారు. భారత బౌలర్లలో దగర్ మూడు వికెట్లు, అవేష్ ఖాన్ రెండు, అహ్మద్, బథమ్, వాషింగ్టన్ సుందర్ తలా ఒక్కో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నారు.