వరంగల్ లోక్సభ బై పోల్ : తెరాసకు వైకాపా మద్దతిస్తుందా లేక బరిలోకి దిగుతుందా?
వరంగల్ లోక్సభకు జరిగే ఉప ఎన్నికల్లో అధికార తెరాసకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ మద్దతిస్తుందా లేదా బరిలోకి దిగుతుందా అనే అంశంపై ఇపుడు తెలంగాణలో చర్చ సాగుతోంది. ఎందుకంటే.. కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు వైకాపా మద్దతిచ్చింది. అదేవిధంగా ఈ ఎన్నికల్లోనూ వైకాపా మద్దతును తెరాస నేతలు ఆశిస్తున్నారు.
అయితే, వరంగల్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం వైకాపా నేతలు అందుకు ససేమిరా అంటున్నట్టు సమాచారం. గత యేడాదిన్నర కాలంగా తెరాస ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉందని అందువల్ల ఈ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి వుంది.
నిజానికి టీఆర్ఎస్కు, వైసీపీకి మధ్య వరంగల్ కేంద్రంగానే యుద్ధం సాగింది. గతంలో జగన్ మహబూబాబాద్ పర్యటన సమయంలో ఈ రెండు పార్టీల మధ్య పెద్ద వివాదమే జరిగింది. మరి ఇప్పుడు అదే వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఉపఎన్నికలో వైసీపీ టీఆర్ఎస్కు మద్దతు ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరంటారు.
వరంగల్ ఉపఎన్నికలో పోటీ చేస్తే బాగుంటుందని తెలంగాణ వైసీపీ నేతలు కొందరు అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. వరంగల్ లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో జిల్లాలో బలమైన ఎస్సీ నేత కోసం ఇప్పటికే వేట మొదలుపెట్టారన్న చర్చ జరుగుతోంది. మరి ఏమాత్రం బలం లేని ఫ్యాన్ పార్టీ బరిలోకి దిగే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఉనికి చాటుకోవడానికి తప్ప... పోటీ చేసి గెలుపోటములను ప్రభావితం చేసేంత బలం వైసీపీకి లేదన్నది వాస్తవం.