శుక్రవారం, 18 జులై 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By దేవీ
Last Updated : గురువారం, 17 జులై 2025 (18:36 IST)

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

Dr. II L V Gangadhara Sastry
Dr. II L V Gangadhara Sastry
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు ... యుక్తస్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖః II ... 'గీత' మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి ధ్యాన యోగాన్ని సిద్ధింపజేస్తుంది.ఆహారం మితం గా భుజించాలి. సాత్వికాహారం భుజించాలి. దైవార్పితాహారం భుజించాలి. న్యాయార్జితాహారం భుజించాలి. తగు విధం గా ఆహార విహారములు, తగు విధం గా నిద్ర మెలకువలు పాటించాలని గీత చెబుతుంది. గీత చర్చించని అంశం ఉండదు. ఇది కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం మాత్రమే బోధించబడింది కాదు. యావత్ మానవ జాతి శ్రేయస్సును కాంక్షిస్తూ అర్జునుణ్ణి నిమిత్తం గా చేసుకుని బోధించబడిన కర్తవ్యబోధ. 
 
Sanmanm to Dr. II L V Gangadhara Sastry at America, Cincinnati ISKCON Temple
Sanmanm to Dr. II L V Gangadhara Sastry at America, Cincinnati ISKCON Temple
అందుకే పాశ్చాత్యులు సైతం గీతను మత  గ్రంధం కాదని, మానవీయ గ్రంథమని చాటారు. కాబట్టే అమెరికా లోని శాటన్ హాల్ యూనివర్సిటీ లో MBA చదివే విద్యార్థులకు భగవద్గీత ను కూడా ఒక కోర్స్ గా బోధిస్తారు. ఇది వైరాగ్య గ్రంధం కాదని - గీతా బోధ విని, ఆచరించి విజయుడైన అర్జునునుడి ద్వారా తెలుసుకోవాలి. పునర్జన్మ సిద్ధాంతాన్ని గీత ధృవీకరిస్తుంది. మనం చేసే పాప పుణ్యాల ఫలితాలను అనుభవించడానికే జన్మలెత్తుతామని... ఇలా అనేక జన్మములెత్తిన పిమ్మట వాసుదేవుడే సర్వమని తెలుసుకుని ఆయనను ఆశ్రయించి మోక్షం పొందుతామని కృష్ణుడు చెబుతాడు. 
 
భగవద్గీత అనే అద్దం  ముందు నిలబడితే మనపైన మనకొక స్పష్టత వస్తుంది. అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి  జ్ఞానం లభించి మనం ఆచరించవలసిన కర్తవ్యం బోధపడుతుంది. ఇది దేశ కాల జాత్యాదులకతీతం గా, మతాలకతీతం గా బోధించబడిన జీవన గీత. మరణ గీత కాదు. దీనిని బాల్యదశనుండే అభ్యసించాలి." అన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు  డాII  ఎల్ వి గంగాధర శాస్త్రి. 
 
 'ప్రపంచశాంతి కొరకు గీతా ప్రచార యాత్ర' లో భాగం గా అమెరికా లోని సిన్సినాటి లో ని ఇస్కాన్ దేవాలయం లో (12. 7. 2025)  జరిగిన గీతా ప్రవచనం లో -నిత్య జీవితం లో గీత ఆవశ్యకత గురించి వివరించారు. విశ్వరూపసందర్శన  యోగ ఘట్టాన్ని కళ్ళకి కట్టినట్టు గా తాత్పర్యసహితం గా గంగాధర శాస్త్రి గానం చేశారు. అందరితో కృష్ణ భజన చేయించారు. 
 
కార్యక్రమం ముందు  చిన్నారులు చేసిన భక్తియోగ పారాయణను, నాట్యం చేసిన చి II విద్యాసాంజలి రామినేని, చి II శ్రీధ వరాళి చదలవాడ లనూ అభినందిస్తూ భగవద్గీతా ఫౌండేషన్ తరఫున వారికి గంగాధర శాస్త్రి ప్రశంసా పత్రాలను అందజేశారు. డాII వేదాంతం రామానుజా చార్యుల చేయూతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
కార్యక్రమాన్ని అత్యంత రంజకం గా నిర్వహించిన  ప్రసిద్ధ గేయ రచయిత శ్రీ రమాకాంతారావు ను, ఆత్మీయ ఆతిధ్యాన్ని అందించిన శ్రీ అశోక్, శ్రీమతి దివ్యశ్రీ  మల్లెంపాటి లను, కార్యక్రమానికి సహాయ సహకారాలందించిన శ్రీ రామినేని అయ్యన్న చౌదరి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ  సందర్భంగా డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి చేసిన సత్కారం లో శ్రీ రమాకాంతరావు కంద పద్యాలతో రచించిన ప్రశంసా పత్రాన్ని శ్రీ భట్టు యద్దనపూడి చదివి వినిపించారు. కార్యక్రమానంతరం శ్రీ రాఘవేంద్ర తాడిపర్తి, శ్రీమతి అపర్ణ, శ్రీ ఈశ్వర్, డా వేదాంతం చారి ల గృహాలలో ఆతిథ్యం స్వీకరించి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భం గా Mr. Jay, Mr. Kyle లు భారతీయ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు గంగాధర శాస్త్రి ని కలిసారు