శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (16:25 IST)

ఉచిత తాయిలాలు అమెరికా దాకా వెళ్లాయి... అరవింద్ కేజ్రీవాల్

kejriwal
ఈ యేడాది నవంబరు నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిస్తానని అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. దీనిపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఉచిత తాయిలాలు అమెరికా వరకు వ్యాపించాయి అంటూ సెటైర్లు వేసారు. 
 
"అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 12 నెలల్లో ఇంధన, కరెంట్‌ బిల్లులు సగానికి తగ్గిస్తా. మన విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఈ చర్యల వల్ల అమెరికా మరీ ముఖ్యంగా మిచిగాన్‌లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి" అని తన ట్విట్టర్ ఖాతాలో డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 
 
దీనిపై కేజ్రీవాల్  స్పందించారు. "విద్యుత్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా దాకా వెళ్లాయి" అని పేర్కొన్నారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌ ప్రభుత్వం ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే ఎన్నికల సమయంలో పలు పార్టీలు కూడా ఈ తరహా ప్రకటనలు చేయగా.. ఈ హామీల ప్రభావం గెలుపుపై చూపిన సందర్భాలున్నాయి. 
 
ఇక ఇటీవల అరవింద్ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మోడీ తరపున ప్రచారం చేస్తానని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి అని ప్రజలకు అర్థమైందన్నారు. భాజపా అధికారంలోకి వస్తే.. ఇప్పుడు ఆప్‌ ప్రభుత్వం అందిస్తోన్న ఉచితాలు నిలిపివేస్తుందన్నారు.