శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2020 (13:10 IST)

పూజారులతో తొక్కించుకుంటే పిల్లలు పుడతారా?

మన దేశంలో మూఢ నమ్మకాలు ఇంకా పోలేదు. ముఖ్యంగా, వెనుకబడిన రాష్ట్రాలతో పాటు గిరిజన ప్రాబల్య రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా నమ్ముతుంటారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ధమ్‌తరీ జిల్లాలోలో పూజారుల చేత తొక్కించుకుంటే పిల్లలు పుడతారనే నమ్మకం ఆ ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకునిపోయింది. దీంతో ప్రతి యేటా జరిగే మధాయి జాతరకు వేలాది మంది మహిళలు తరలివచ్చి.... తలంటు స్నానాలు ఆచరించి, బోర్లా పడుకుని పూజారులతో తొక్కించుకుంటారు. ఈ జాతర అంగామోతి మాత దేవాలయం వద్ద జరుగుతుంది. 
 
ఈ యేడాది కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఉన్నప్పటికీ మహిళలు పెద్ద సంఖ్యలో ఈ జాతరకు తరలివచ్చారు. సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలన్నింటినీ గాలికి వదిలేశారు. పూజారులతో తొక్కించుకుంటే పిల్లలు పుడతారని అక్కడ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లి తాను మహిళల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తానని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ కిరణ్యయి నాయక్ తెలిపారు.
 
మహిళలపై కొందరు పురుషులు అలా నడుచుకుంటూ వెళ్లడం సరికాదన్నారు. వారి మత విశ్వాసాలు దెబ్బతినకుండానే తాము త్వరలో అవగాహన కల్పిస్తామన్నారు. 52 గ్రామాల నుంచి తరలివచ్చిన దాదాపు 200 మంది మహిళలు నేలపై బోర్లా పడుకుని ఉండగా పదుల సంఖ్యలో పూజారులు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. అమ్మవారికి సమర్పించడానికి వారు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి తీసుకొచ్చారు.